సాగుభూములు కోల్పోయి ఆదివాసి మహిళల ఆవేదన.. తహసీల్దార్కు వినతి
అశ్వాపురం,(విజయక్రాంతి): మండల పరిధిలోని బి.జి కొత్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ పాఠశాల కోసం తాము సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆదివాసి మహిళలు శుక్రవారం అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాము సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములను ముందస్తు సమాచారం లేకుండా తీసుకోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనంపై సరైన పరిశీలన జరిపి తమకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ భూములు లేదా తగిన పరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వినతిని స్వీకరించిన అధికారులు సమస్యను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






