21-02-2026 12:00:00 AM
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించి మహబూబాబాద్ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలపాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కురవి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ (బాలికల) పాఠశాల, మహబూబాబాద్ పట్టణంలోని మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర) లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టడీ అవర్ లో జరుగుతున్న కంప్యూటర్ తరగతులను స్వయంగా పరిశీలించారు.
పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ పెంచాలని సూచించారు. నాణ్యమైన డైట్ మెనూ అందించాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువుపై దృష్టి పెడతారని, అందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులు వారి మండలాలలో ఉన్న సంక్షేమ వసతి గృహాల తనిఖీ చేసి ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం వార్డెన్, ప్రిన్సిపల్ లకు తగిన సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు షెడ్యూలు ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు, పిల్లలకు నూతన డిజిటల్ తరగతులు అర్థమయ్యే విధంగా బోధించాలని తెలిపారు. తాజా, స్వచ్ఛమైన ఆహార పదార్థాలను కూరగాయలను ఉపయోగించాలని, వంట సిద్ధం చేసిన తర్వాత కచ్చితంగా ఉపాధ్యాయులు రుచి చూసి పిల్లలకు అందించాలని తెలిపారు.
పిల్లలకు అందించే భోజన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.