వంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం చూపాలి
జనసేన నాయకుడు కమ్మరి శ్రీను
గజ్వేల్, ఆగస్టు 8: ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డు సమీపంలో నిత్యం నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు కమ్మరి శ్రీను కోరారు. హైదరాబాద్– రామగుండం ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. మార్కెట్ యార్డు పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా స్థానిక ప్రజలతో పాటు హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు, ఆర్వీఎం ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం ట్రాఫిక్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డు వద్ద శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని శ్రీను కోరారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులతో పరిశీలన చేయించాలని విజ్ఞప్తి చేశారు.






