అచ్చంపేట అభివృద్ధికి మహర్దశ
- నల్లమలకు కొత్త రవాణా బాట
- త్వరలోనే బుల్లెట్ రైలు, ఎలివేటెడ్ కారిడార్, నాలుగు లైన్ల రహదారులు
- అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్పై చర్యలు
- ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదనలకు మంత్రి కోమటిరెడ్డి సానుకూల స్పందన
అచ్చంపేట, ఆగస్టు 24: అచ్చంపేట, నల్లమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బల్మూరులో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. శంషాబాద్ నుంచి మన్ననూరు వైపు బుల్లెట్ రైలు మార్గం ప్రతిపాదన ఉందని, మన్ననూరు, శ్రీశైలం మధ్య 52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ కోసం డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు.
హాజీపూర్ నుంచి అచ్చంపేట వరకు 6 కి.మీ. నాలుగు లైన్ల రహదారికి నిధులు మంజూరు చేస్తామని, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నల్లమలను ప్రత్యేక పర్యాటక జోన్గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రతిపాదించిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అచ్చంపేట అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ మల్లు రవి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






