11-02-2026 03:36:32 PM
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు
షాద్నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు శాంతియుతంగా ఓటును వేయాలని, పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ ఎన్నికల కేంద్రాన్ని కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. స్థానిక డిసిపి సిహెచ్ శిరీష రాఘవేంద్ర ఒకటో వార్డులో పోలింగ్ కేంద్రాన్ని కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉన్నఫలంగా ఓటు హక్కు ఉండదని, కానీ భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన ప్రధానమైన ఓటు హక్కు 18 ఏళ్లకే మనకు వర్తిస్తుందని ఇలాంటి శక్తివంతమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని సుదీర్ బాబు సూచించారు. ఎన్నికల్లో డబ్బు మద్యం తదితర ప్రలోభాలకు గురి చేసిన సందర్భంగా రోజువారిగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయనీ తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, మనమందరం కలిసి పనిచేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయోత్సవ ర్యాలీల పేరిట ప్రజలకు ఇబ్బందులు సృష్టించవద్దని కమిషనర్ వెల్లడించారు. డిసిపి కార్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన జరిగిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. కమిషనర్ వెంట డిసిపి సిహెచ్ శిరీష రాఘవేంద్ర పట్టణ సిఐ విజయ్ కుమార్ కొత్తూరు సిఐ నర్సయ్య ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.