APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా(Kadapa) పుల్లంపేటలో సోమవారం ఘోరప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Andhra Pradesh State Road Transport Corporation)కు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు లారీని ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఉడుమువారిపల్లి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు కుడి వైపున ఉన్న సుమారు ఆరు సీట్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల ప్రాణనష్టం, గాయాలు సంభవించాయని పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 27 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఇతర వైద్య కేంద్రాలకు తరలించారు. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అలాగే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యలు, ప్రమాదానికి గురైన బస్సు, లారీకి సంబంధించిన వివరాలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






