ఇది ‘ఉస్తాద్ ఉగాది’
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇందులో శ్రీలీల, రాశిఖన్నా కథానాయికలు. ఉగాది కానుగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. “ఈ ఉగాది ‘ఉస్తాద్ ఉగాది’ కాబోతుంది.
ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందని నేను చెప్పలేను కానీ, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇలాంటి సినిమా వచ్చి కాలమైంది, ఇంత ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని అనుకుంటారు. పూర్తిస్థాయి పవన్కళ్యాణ్ సినిమా చూశామనే సంతృప్తినిస్తుంది ‘ఉస్తాద్’. మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత” అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇప్పటికీ నాలుగైదు సార్లు చూశాను.
ఎన్నిసార్లు చూసినా ఒకటే అభిప్రాయం.. ఇది పూర్తిస్థాయి ఎంటర్టైనర్” అని చెప్పారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఉస్తాద్’ రూపంలో ఒక మంచి తెలుగు సినిమా ఉగాదికి వస్తుంది. సినిమా పట్ల మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది” అని తెలిపారు. కథానాయిక రాశిఖన్నా మాట్లాడుతూ.. “2026లో నా మొదటి సినిమా, ఉగాదికి వస్తుంది, పైగా పవన్కళ్యాణ్ ఉన్నారు. ఇది నాకు ట్రిపుల్ సెలబ్రేషన్. ఉస్తాద్ భగత్ సింగ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు.




