ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి తీన్మార్ మల్లన్న
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
మేడిపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను(Telangana RTC Strike) ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను(RTC Workers Demands) ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు ఎమ్మెల్సీ, పి ఆర్ పి అధ్యక్షులు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మద్దతు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు.
బుధవారం తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.... ఆర్టీసీ కార్మికుల డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని ఆర్టీసీతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే రేవంత్ ప్రభుత్వం చేస్తుందని, గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు.
అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్ లో ప్రమాదం జరిగిందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా, కార్మికుల కష్టానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నరని, అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం ఎంత ప్రమాదకరమో అనుభవం లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడపడం అంతే ప్రమాదకరమని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలతో పరిస్థితిని మరింత విషమం చేస్తున్నారని వెంటనే కార్మికులతో చర్యలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని మల్లన్న డిమాండ్ చేశారు.






