24 July, 2026 | 2:12 PM

నీట్‌పై కేంద్రం, NTAకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

24-07-2026 01:06 PM

న్యూఢిల్లీ: NEET-UG వ్యవహారంపై కేంద్రం, ఎన్ టీఏకు సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన NEET-UG పరీక్షకు సంబంధించిన అంశాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి వ్యతిరేకంగా 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్' (FAIMA) దాఖలు చేసిన పిటిషన్‌పై, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అలాగే, ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని NTAని ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు సంబంధించి NTAపై FAIMA ఒక రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. NEET పరీక్షకు సంబంధించి చోటుచేసుకున్న వరుస లోపాలకు ముగింపు పలకాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి మారే ప్రణాళికల వివరాలను కోరింది. నీట్ పేపర్ లీక్స్(NEET Paper Leaks) అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం, తాము ఈ విషయాన్ని చాలా నిశితంగా పర్యవేక్షిస్తామని, క్రమం తప్పకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రానికి తెలిపింది. కేంద్రం తరపున వాదిస్తున్న భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ... పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు కృషి చేస్తోందని పేర్కొన్నారు. అలాగే, కోర్టు ముందు ఒక సమగ్ర దృక్పథాన్ని ఉంచేందుకు ఆయన మరికొంత సమయం కోరారు. "దీనిని ఇలాగే కొనసాగనివ్వలేం" అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని జూలై 27కి వాయిదా వేసింది. 

నీట్ పేపర్ లీక్స్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,  కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం ప్రారంభంలో సీజేపీ పార్లమెంటుకు 'చలో సంసద్' యాత్రను ప్రారంభించడంతో ఢిల్లీ వీధుల్లో వరుస హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో నిరసనకారులు, పోలీసులు ఇద్దరూ గాయపడ్డారు. ఈ ఘర్షణల సమయంలో ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.