జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం
- 19 మంది దుర్మరణం, 50 మందికిపైగా గాయాలు
- మద్యం మత్తులోడ్రైవర్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
జైపూర్, నవంబర్ 3: రాజస్థాన్ రాజధాని జైపూర్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఫలోది జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఘటనలో 15 మంది యాత్రికులు మృతిచెందారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికిపైగా మరణించారు. సుమారు 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. హర్మడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సికార్ రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ డంపర్ ట్రక్కును అతివేగంతో నడుపుతూ కార్లు, బైక్లతో సహా పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదంలో మొత్తం పదికి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని సవాయి మాన్సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ మంత్రి డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.




