మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బాధాకరం
ఉద్యమకారుడు జోగు లింగస్వామి మాదిగ
చిట్యాల,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ ఉద్యమకారులను మరియు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జోగు లింగస్వామి మాదిగ అన్నారు. ఆదివారం చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు జోగు లింగస్వామి మాదిగ మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ ఉద్యమకారులను, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు తమ జీవితాల్లో విలువైన సమయాన్ని వెచ్చించి, ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఉద్యమకారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ఎమ్మెల్యే వేముల వీరేశంపై వ్యక్తిగత విమర్శలు చేయడం కంటే, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సంయమనంతో వ్యవహరిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలను నివారించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు జోగు లింగస్వామి మాదిగ హితవు పలికారు.






