నల్ల బ్యాడ్జీలతో రేజర్ల పాఠశాల ఉపాధ్యాయుల నిరసన
పీఆర్సీ ప్రకటనతో పాటు పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉపాధ్యాయులు
సత్తుపల్లి.(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ఇప్పటికీ ప్రకటించకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరు డీఏలు పెండింగ్లో ఉండడం, జీవో నెం. 25ను సవరించడం, పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే క్లియర్ చేయడం వంటి పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట, బూర్గంపల్లి, రేజర్ల, కిష్టారం, గంగారం, రామానగరం, నారాయణపురం, కాకర్లపల్లి, కిష్టాపురం తదితర గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.






