నాచారం పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఉప్పల్,(విజయక్రాంతి): రక్షాబంధన్ పండుగ సందర్భంగా నాచారం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ విజయతో పాటు మహిళా సిబ్బంది మౌనిక, నాగమణి, పూర్ణ, అరుణ, సుష్మలు పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సిబ్బంది సీఐ ధనుంజయ గౌడ్, డీఐ మాన్సింగ్, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, మైబెల్లీ, గోవర్ధన్, హెడ్ కానిస్టేబుల్స్ మట్టయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ సాగర్, పవన్, హోంగార్డు వెంకటేష్లకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటారు.
ఈ సందర్భంగా సీఐ ధనుంజయ గౌడ్ మహిళా పోలీసు సిబ్బందికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోలీస్ శాఖలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రక్షాబంధన్ వంటి పండుగలు పరస్పర గౌరవం, ఆత్మీయత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పోలీసు సిబ్బంది మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, కుటుంబ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాగింది. పాల్గొన్న అధికారులు, సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందాన్ని పంచుకున్నారు.






