మధుమేహ సంబంధిత కంటి వ్యాధుల గుర్తింపుపై ఏఐ పరిశోధనకు పీహెచ్.డీ
పటాన్ చెరు, ఆగస్టు 24: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని జి.కార్తీక డాక్టరేట్ కు అర్హత సాధించారు. డయాబెటిక్ రెటినోపతి, మధుమేహ సంబంధిత కంటి వ్యాధుల స్వయంచాలక గుర్తింపు, వర్గీకరణ కోసం డీప్ లెర్నింగ్, ట్రాన్స్ ఫార్మర్-ఆధారిత ఫ్రేమ్ వర్కుల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. విజయకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సిద్ధాంత వ్యాసం, ఫండస్ చిత్రాల నుంచి రెటీనా వ్యాధులను కచ్చితంగా, సమర్థవంతంగా నిర్ధారించడానికి, డీప్ లెర్నింగ్, విజన్ ట్రాన్స్ ఫార్మర్స్, జెనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్ వర్కులను (GANs) ఉపయోగించి అధునాతన కృత్రిమ మేధస్సు నమూనాలను అభివృద్ధి చేసినట్టు తెలియజేశారు. ఈ పరిశోధన, కృత్రిమ రెటీనా డేటాసెట్లను రూపొందించడానికి, వ్యాధి నిర్ధారణ కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, వ్యాధి తీవ్రతను వర్గీకరించడానికి వినూత్నమైన ఏఐ-ఆధారిత ఫ్రేమ్ వర్కులను పరిచయం చేసినట్టు వివరించారు.
ప్రతిపాదిత ఈ వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో, నేత్ర వైద్యులకు ముందస్తు రోగ నిర్ధారణలో సహాయపడటానికి, రోగ నిర్ధారణ పనిభారాన్ని తగ్గించడానికి, పెద్దయెత్తున మధుమేహ నేత్ర పరీక్షలను సులభతరం చేయడానికి దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. డాక్టర్ కార్తీక సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






