కామారెడ్డిలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ 08468-220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.జిల్లా సివిల్ సప్ప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకారాధికారి, రామ్మోహన్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




