ఊరికి దూరంగా.. ఓపెన్ జిమ్లు
జనావాసంలోకి తీసుకురావాలంటున్నా యువత
ధర్మపురి, జూన్7 (విజయక్రాంతి): నేటి ఆధునిక యుగంలో ధనిక,పేద తేడా లేకుండా అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది.ఉదయం, సాయంత్రాలైతే ఆరోగ్య ప్రేమికులు రహదారుల వెంబడి వాకింగ్ కు, మైదానాలకు పరుగులు పెడుతున్నారు.రన్నింగ్,జాగింగ్,యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కుంటున్నారు. ప్రజలకు శారీరక ఆరోగ్యం తో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు గత ప్రభుత్వం ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లు ఆశించిన ఫలితాలు దక్కలేదనే చెప్పుకోవాలి. ఉమ్మడి వెల్గటూర్ మండలంలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిన ఎండపల్లి,వెల్గటూర్,చర్లపల్లి, రాజారాం పల్లి,ముత్తునూర్,పైడిపల్లి తదితర గ్రామాల్లో దాదాపుగా జనావాసాల కు దూరంగానే వీటిని ఏర్పాటు చేశారు. ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో చాలా స్వల్ప సంఖ్యలోనే వీటిని వినియోగించే వారున్నారు.
ఊరికి రెండు మూడు కిలో మీటర్ల దూరంలో,ప్రజా సంచారం లేని ప్రదేశాల్లో ఉండడంతో ప్రజలు,యువత వీటి వైపు వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపకపోవడంతో చాలా గ్రామాల్లో నిరుపయోగంగానే ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో స్కూల్ మైదానాల్లో, ఊరికి దగ్గరగా ఉండే ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్ జిమ్ లకు వెళ్ళలేని ఆర్థిక స్థోమత లేని మధ్య తరగతి ప్రజలు,యువత కోసం వీటి ఏర్పాటు హర్షణీయమైనప్పటికి ఊరికి దూరంగా ఉండడంతో నిరుపయోగంగా మారాయి.చాలా చోట్ల పర్యవేక్షణ కరువై లూబ్రికేషన్ చేయకపోవడం తో పరికరాలు పాడైపోతున్నాయి. ప్రజలకు అందు బాటులో వీటిని ఏర్పాటు చేయాలని ప్రజ లు కోరుతున్నారు. చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండడంతో పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
అప్పుడున్న పరిస్థితు లకు అనుగుణంగా గ్రామాలకు దూరంగా ఓపెన్ జిమ్లు వివిధ స్థలాల్లో ఏర్పాటు చేసినప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలను పరిగణలోకి తీసుకుని తిరిగి ఓపెన్ జిమ్ లను గ్రామాల్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అధికా రులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా చర్య లు చేపట్టి ఓపెన్ జిమ్ లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటూ ఆ యా గ్రామాల్లోని యువత కోరుకుంటుంది.






