100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర శనివారం సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టీజీఎంఐడీసీ అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ పనులు ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు కూడా నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో టీజీఎంఐడీసీ డీఈ, ఏఈ, నిర్మాణ కాంట్రాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి హర్షవర్ధన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






