వ్యవ‘సాయానికి’ యాంత్రికరణ
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో శ్రమ, ఖర్చు తగ్గుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న యాత్రికరణ విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి సరిత కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న యాంత్రికరణ పనిముట్ల వినియోగం, సర్వీస్ సెంటర్ ల ద్వారా రైతులకు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డ్రోన్ యంత్రాల పనితీరును శనివారం పరిశీలించారు.
కేసముద్రం మండలం దనసరి సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులోకి తెచ్చిన డ్రోన్ యంత్రాల పనితీరును, వినియోగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే నెల్లికుదురు మండలంలో యాసంగి పంటల సాగు, ఎరువుల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయంలో రైతులకు ఖర్చు, శ్రమ తగ్గించేందుకు ఆధునికమైన వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులు తక్కువ ఖర్చుతో శ్రమ తగ్గించుకొని పంటల సాగులో ఎరువులు, పురుగు మందులు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వినియోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో లు వెంకన్న, ఛాయా రాజ్, ఏఈఓ లు పాల్గొన్నారు.




