5 July, 2026 | 11:28 AM

ప్రజల భద్రత... ప్రజల రక్షణ తమ ప్రధాన లక్ష్యం

05-07-2026 11:07 AM

- నేరాల నియంత్రణకు ప్రజల సహకారం చాలా కీలకం

- హుజూర్ నగర్ లో భారీ కార్డెన్ సెర్చ్

- కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు

హుజూర్ నగర్,(విజయక్రాంతి): ప్రజల భద్రత, ప్రజల రక్షణ తమ ప్రధాన కర్తవ్యమని కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, సిఐ చరమందరాజు తెలిపారు. ఆదివారం వేకువజామున హుజూర్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా  కోదాడ డిఎస్పి శ్రీనివాస రెడ్డి,సిఐ చరమందరాజు మాట్లాడుతూ...నేరాలు,అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సర్కిల్ వ్యాప్తంగా విస్తృతమైన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ,అక్రమ రవాణా నిరోధక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా హెల్మెట్ ,రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని తెలిపారు.నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు,అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ చరమంద రాజు వెల్లడించారు. హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో వందమంది పోలీసుల సమక్షంలో చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 51 వాహనాలు సీజ్ చేశారు.వాటిలో 42 బైకులు,8 ఆటోలు, ఒక టాటా ఎస్ పట్టుపడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నరేష్, నవీన్ కుమార్, పరమేష్, శ్రీకాంత్, కొటేష్,పోలీస్ సిబ్బంది,పాల్గొన్నారు.