29 August, 2026 | 4:47 PM

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

29-08-2026 03:47 PM

హనుమకొండలో నూతన స్విమ్మింగ్ పూల్ ప్రారంభం 

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ  ఆధ్వర్యంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు.

స్విమ్మింగ్ వంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎంపీ తెలిపారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ను క్రీడాకారులు, యువత సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.