మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
హైదరాబాద్: గణేష్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో నగరంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది. మొదటి రైలు సెప్టెంబర్ 6న ఉదయం 6:00 గంటలకు ప్రారంభమవుతుందని, అలాగే చివరి రైలు సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 1:00 గంటలకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరుతుందని వెల్లడించింది. నగరవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఊరేగింపులలో పాల్గొనే భక్తులకు ప్రయాణం సులభతరం చేయడమే లక్ష్యమని.. పండుగ రద్దీని నిర్వహించడానికి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ఈ పొడిగింపుతో నగరంలోని అతిపెద్ద పండుగకు మద్దతుగా మెట్రో సేవలు అర్థరాత్రి వరకు అందుబాటులో ఉన్నందున, భక్తులు ఆందోళన లేకుండా జరుపుకోవచ్చని మెట్రో అధికారులు పేర్కొన్నారు.






