అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు
హైదరాబాద్: సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలోని వెంకటరెడ్డి నగర్లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి తృటిలో 16 కుటుంబాలు తప్పించుకున్నాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో దాదాపు 60 మంది నివాసితులు నిద్రపోతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
నివాసితులలో ఒకరు పొగను గమనించి మేల్కొని, భవనంలోని ఇతరులను అప్రమత్తం చేశారు. అగ్నిప్రమాదంలో ఐదు బైకులు, నాలుగు సైకిళ్లు, ప్యానల్ బోర్డు దగ్ధం అయ్యాయి. ఇతర విలువైన వస్తువులు కాలిపోయినప్పటికీ, నివాసితులందరూ సురక్షితంగా తప్పించుకోగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




