31 July, 2026 | 4:21 PM

విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలి

31-07-2026 04:00 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీ మైనారిటీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం పరిశీలించారు. వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిత్యావసర వస్తువులు, అవసరమైన సామగ్రిని నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, నీటిపారుదల శాఖ అధికారులు జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ కుమార్, వీరన్న, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహశీల్దార్లు ఖాజా మొయినుద్దీన్, సుజాత, ఎంపీడీఓ రాధా రాథోడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.