రాముడితో రాజకీయం చేయొద్దు..
సిద్దిపేట , ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రామకోటితో రాజకీయం చేస్తే సహించేది లేదని సిద్దిపేట రామకోటి బృందం నాయకులు మధుసూదన్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ అనే వ్యక్తి రామకోటితో రేవంత్ రెడ్డి పేరు రాసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపించారు.
రామకోటిలో రాజకీయ నాయకుల పేరు రాసినందుకు గతంలోనే మార్కండేయ దేవాలయంలో అతడిని మందలించామని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా గుండు రవితేజ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు శ్రీనివాసచారి, నాగరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






