calender_icon.png 12 February, 2026 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అరాచకాలు ప్రజాస్వామ్య విరుద్ధం

12-02-2026 02:52:38 AM

  1. ఎన్నికల్లో గెలుపు కోసం నీచ రాజకీయాలు
  2. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి11 (విజయక్రాంతి): నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు మండి పడ్డారు. సీఎం మొదలుకొని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.

బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతికదాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని, చట్టాన్ని సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగుల కు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని హితవు పలికారు. అధికార పార్టీ అకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జీలను అభినందించారు. బీఆర్ ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకూ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.