ప్రజాసమస్యలను పరిష్కరించాలి
అధికారులను ఆదేశించిన ఎంఎంసి కమిషనర్
బోడుప్పల్ వీరారెడ్డి నగర్లో పర్యటించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించాలి అని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వీరారెడ్డి నగర్ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజతో సహా పర్యటించి కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రహదారులు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీల పరిస్థితి, పారిశుధ్య కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. రహదారుల మరమ్మతు పనులు, పారిశుధ్య నిర్వహణ, చెత్త సకాలంలో తొలగింపు, డ్రైనేజీల శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






