04-02-2026 02:18:30 AM
హైదరాబాద్, పిబ్రవరి 3 ( విజయక్రాంతి): మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 2996 వార్డులకు గాను 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళ వారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 19,694 మంది అభ్యర్థుల కు గాను చివరి రోజు న 6,701 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 కార్పొరేషన్లకు గాను ఈ నెల 11న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ టికెట్లు దక్కని వారు స్వతంత్రులుగా, ఇతర పార్టీల్లోకి వెళ్లి బరిలో నిలిచారు.
ఈ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే 12న నిర్వహించనున్నారు. 13న లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక 16న 116 మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్కు ఎన్నిక, 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు పారద్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
పీసీసీ పరిశీలకుల నియామకం
ప్రతి మునిసిపాలిటీ , కార్పొరేషన్కు పీసీసీ పరిశీలకులను బుధవారం నుంచి నియమించనున్నది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు లేని నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించనున్నది.