మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి
- పొలంలోని కొట్టం వద్ద అవమానియ రీతిలో ఘటన
- పొలం వద్ద కాళ్లు చేతులు కట్టేసి ఘాతుకం
- చనిపోయిందని భావించి శోభమ్మను పడేసిన దృశ్యం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
షాద్నగర్,(విజయక్రాంతి): ఓ దళిత మహిళను అర్ధరాత్రి పశువుల కొట్టంలో బంధించి విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా దాడి చేసి గాయాల పాలు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరి గూడ మండలం పరిధిలోని ఎదిర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదిరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభమ్మను అదే గ్రామానికి చెందిన మైలారం బందయ్య, వడ్డే అశోక్, గోడుగోని పల్లి మొగులయ్య విచక్షణ రహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.
ఎదిర గ్రామానికి చెందిన మైలారం అంజయ్యకు శోభమ్మకు మధ్య సంబంధం ఉందని అనుమానిస్తూ అంజయ్య కుమారుడు మైలారం బందయ్య మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం శోభమ్మపై నిన్న అర్ధ రాత్రి దాటిన తర్వాత దాడికి తెగబడ్డారు. పశువుల కొట్టం వద్ద శోభమ్మను రావాలని పిలిచిన మైలారం అంజయ్య అక్కడ లేకపోగా అతని కుమారుడు మైలారం బందయ్య, వడ్డే అశోక్, మొగులయ్య ముగ్గురు సంఘటన స్థలంలో ఉన్నారు.
అర్ధరాత్రి వేళ ఆమెను బలవంతంగా కాళ్లు చేతులు కట్టేసి నేలపై పోర్లించి మరి కొట్టారు. అర్ధరాత్రి సమయంలో మహిళను వ్యవసాయ పొలం వద్దకు పిలిచి చేతులు కాళ్లు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోవడంతో ఆమె చనిపోయిందని భావించి గ్రామంలో వాటర్ ట్యాంకు సమీపంలో ఆమెను పడేశారు. మళ్లీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడ శవం ఉంది తీసుకుపోవాలని సూచించినట్లు బాధితులు తెలిపారు. దాడికి గురి కావడంతో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.
కేసు నమోదు చేశా.. ఎస్సై విజయ్
బాధితుల ఫిర్యాదుతో ఈ సంఘటనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగిందని చౌదరిగుడా సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మైలారం బందయ్య పై మాత్రమే కేసు నమోదు చేశామని విచారణ జరిపి ఈ కేసు కు సంబంధం ఉన్న వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మైలారం అంజయ్య పొలం వద్దకు పిలవడంతో శోభమ్మ వెళ్లిందని అక్కడ వెళ్లాక ఆయన కుమారుడు మైలారం బందయ్య బలవంతంగా ఆమెపై కాళ్లు చేతులు కట్టి దాడికి పాల్పడినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.






