12 August, 2026 | 9:18 AM

Breaking News

దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి   •   సీజనల్ వ్యాధుల వైద్యుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడేగం సర్పంచ్   •   లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం   •   ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి శ్రీధర్‌ రావు నియామకం   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేడీ ఆకస్మిక సందర్శన   •   ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!   •   బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి   •   మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం   •  

చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తులు

12-08-2026 01:41 AM
  1. ఈ నెల 31 వరకు స్వీకరణ
  2. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మం జూరుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారమే అర్హ తను పరిశీలిస్తారు. ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

గతంలో దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమ ర్పించని వారు లేదా ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం ఉంటుంది.

దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతో పాటు వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు.