ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలి -ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా గృహనిర్మాణాలతో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమయానికి చేరేలా అధికారులు కృషి చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.




