19-02-2026 12:24:58 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి (19) గురువారం నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలి పారు. అయితే, రంజాన్ మాసం దాదాపు 31ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది.
మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రా ల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో ఆయా ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. పవిత్ర మక్కా మసీదు సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధ్రువీకరించింది.
భారత్లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండనున్న నేపథ్యంలో ఇంటింటా ఆధ్యాత్మిక భావన వెల్లివిరియనుంది. పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లోని ప్రార్థనాలయాల (మసీదు)ను తీర్చిదిద్దారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు 4 గంటల వరకే విధులు
మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.