చెరబండ రాజు నగరవాసులకి న్యాయం చేయాలి
ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు
హనుమకొండ,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణం కోసం దశాబ్దాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న చెరబండ రాజు నగరవాసులను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రశ్నించారు. గతంలో అనేక సందర్భాలలో ఆ కాలనీని అధికారులు ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలను హైకోర్టు స్టే ఆర్డర్ ద్వారా రక్షణ కల్పించటం జరిగిందని, పేదలు దళితుల ఇళ్ళు కూల్చివేయకుండా డాక్టర్ తిరుణహరి శేషు, అడ్వకేట్ బూర రమేష్ లు హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ తీసుకొచ్చి చెరబండ రాజు నగర వాసులకి సహాయంగా నిలబడ్డామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు రాజకీయం చేయకుండా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలను రక్షించే చర్యలు చేపట్టటం తో పాటు ఆ నగర ప్రజల డిమాండ్ లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.




