అచ్చంపేటలో భారీ వర్షం
- పొంగి పొర్లుతున్న వాగులు, కుంటలు చెరువులు.
- ప్రధాన రహదారుల వెంట వరద నీరు.
- చౌటపల్లి గ్రామానికి హై లెవెల్ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.
అచ్చంపేట: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గ ఉమామహేశ్వర ఆలయం కొండలపై నుండి భారీగా వరద నీరు పారుతుంది. అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని బ్రిడ్జిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ బ్రిడ్జి వద్దకు చేరుకుని గ్రామ ప్రజలతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. వరదల సమయంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు వివరించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడి చౌటపల్లి గ్రామానికి శాశ్వత పరిష్కారంగా హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.
సమస్య తీవ్రతను వివరించగా మంత్రి సీతక్క వెంటనే స్పందించి, వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళిక సిద్ధం చేసి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హై లెవెల్ వంతెన నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో వరదల సమయంలో కూడా గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఉండదని, ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.






