ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు “Arrive Alive” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో జ ఆటో, ట్రాలీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆటో, ట్రాలీ డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వాహనాల్లో అధిక లోడ్తో ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించిన ఆయన, జాతీయ రహదారులపై హెవీ లోడ్తో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత కోసం అనుమతించిన పరిమితిలోనే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అలాగే వాహనాల ఫిట్నెస్, బ్రేకులు, లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం తనిఖీ చేసుకోవాలని తెలిపారు. రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ స్టికర్లు, లైట్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఆకస్మికంగా ఆపడం, వేగంగా మలుపులు తిప్పడం వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరమని హెచ్చరించారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటికోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సబ్ ఇన్స్పెక్టర్లు కమలాకర్, చంద్రశేఖర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




