32 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు
శ్రీరామ్ సత్యనారాయణ ఆచార్యుడికి సన్మానం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గత 32 సంవత్సరాలుగా సేవలందించిన ఆచార్యులు శ్రీరామ్ సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు చిలువేరు వెంకన్న జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత, పూర్వ ఆచార్యులు, పూర్వ ప్రధానాచార్యులు, పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ శ్రీరామ్ సత్యనారాయణను నీతి, నిజాయితీ, కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా అభివర్ణించారు. సమయపాలన, క్రమశిక్షణ, సహనంతో విద్యార్థులకు బోధన అందిస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు.
తెలుగు పాటలు, కవితలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా విద్యార్థుల్లో విలువలను పెంపొందించారని పేర్కొన్నారు. శ్రీరామ్ సత్యనారాయణ మాట్లాడుతూ తాను బోధించిన అనేక మంది విద్యార్థులు నేడు వివిధ ఉన్నత రంగాల్లో, విదేశాల్లో స్థిరపడి రాణించడం ఆనందంగా ఉందన్నారు. విద్యాబోధనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో విజయాన్ని సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అవసరమని సూచించారు. 32 ఏళ్ల సేవా ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, మధుర జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు.






