ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్య కుమార్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. కాజీపేట, ఫాతిమా నగర్, మచిలీ బజార్, సుధా నగర్, యాదవ నగర్ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ మాట్లాడారు.
త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం, నిర్దేశిత లక్ష్యం పూర్తి చేయడం, ఇంకా ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టని అంశంపై ఏఈలకు చీఫ్ ఇంజనీర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డి ఈ రవీందర్, కిషన్ నాయక్, విష్ణువర్ధన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల ఏఈలు, సీఎల్టీసీలు, మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.






