13 August, 2026 | 12:47 PM

లోక్‌సభ నిరవధిక వాయిదా

13-08-2026 11:56 AM

న్యూఢిల్లీ: ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్య, రామమందిర విరాళాల(Ram Mandir donations) అపహరణ ఆరోపణలపై ప్రతిపక్షాల హోరెత్తిన నిరసనలు, చర్చ లేకుండానే పలు కీలక బిల్లుల ఆమోదం వంటి పరిణామాలతో సాగిన వాడివేడి వర్షాకాల సమావేశాలకు ముగింపు పలుకుతూ.. గురువారం నాడు లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఆ రోజు సభ సమావేశం కాగానే జాతీయ గీతంలోని ఆరు చరణాలు వినిపించారు.

ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను(Speaker Om Birla) నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాల కాలంలో లోక్‌సభ పనితీరు, ఉత్పాదకతను ప్రస్తావిస్తూ ఇచ్చే సాధారణ ముగింపు ప్రసంగాన్ని బిర్లా చదివి వినిపించలేదు. సమావేశం సందర్భంగా చర్చలో పాల్గొనాలని బిర్లా ప్రతిపక్ష సభ్యులను పదేపదే కోరినప్పటికీ, ప్రతిపక్షం తమ నిరసనలను కొనసాగించడంతో సభను పదేపదే వాయిదా వేయాల్సి వచ్చింది. గురువారం నాడు కూడా ప్రతిపక్షం ప్రభుత్వంపై నినాదాలు చేసింది. సభ కొద్దిసేపు సమావేశమైనప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.