బీహార్ వరద సంక్షోభం: 14 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం
పాట్నా: బీహార్ వరద(Bihar floods) సంక్షోభంతో జనజీవనం స్తంభించింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని(Bihar Rains) 14 జిల్లాల్లో 40 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని, అనేక నదులు ప్రమాద స్థాయికి పైగా ప్రవహిస్తున్నాయని అధికారులు బుధవారం తెలిపారు. వివిధ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా, నేపాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల(Heavy rains) కారణంగా అనేక చోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.
విపత్తు నిర్వహణ శాఖ (Disaster Management Department) ప్రకటన ప్రకారం, 14 జిల్లాల్లోని 84 బ్లాకుల పరిధిలోని 514 గ్రామ పంచాయతీలలో సుమారు 40.21 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. వరద నీరు కీలక రవాణా మార్గాల్లోకి చేరడంతో, భాగల్పూర్లోని జాతీయ రహదారి 80, ఇతర గ్రామీణ రహదారులపై రెండు నుండి నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. పాట్నాలోని కొన్ని పట్టణ ప్రాంతాల్లో నీటి మట్టాలు కొంతమేర తగ్గినప్పటికీ, సహాయక చర్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ తీవ్ర అంతరాయానికి గురవుతూనే ఉందని రక్షణ బృందాలు ప్రకటించాయి.