ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యం నిర్దేశించుకోవాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్రెడ్డి
దోమకొండ,(విజయ క్రాంతి): ఇష్టంతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గురుకుల విద్యార్థులకు(Domakonda Gurukul students) అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్న వయస్సు నుంచే జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే దిశగా కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలని సూచించారు , తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థలు గర్వపడేలా ఎదగాలని ఆకాంక్షించారు.
అర్థం కాని పాఠాలను అడిగి తెలుసుకోవాలి
గురువులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని సీతా దయాకర్రెడ్డి సూచించారు. అర్థం కాని విషయాలను మొహమాటపడకుండా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితంలో కీలక దశ అని, ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు వచన్కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాముద్దీన్, జిల్లా విద్యాధికారి మల్లికార్జున్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, డీసీఓ శివరాం, మండల విద్యాధికారి విజయ్కుమార్, ప్రిన్సిపాళ్లు చైతన్య, సుధ, మీనాక్షి, కవిత తదితరులు పాల్గొన్నారు.