ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో నిర్వహణ
హాజరైన విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, యాదగిరి గుట్ట ట్రస్టు బోర్డు సభ్యురాలు విజయ రాజం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): బంజారాహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాధా గోవింద, శ్రీ గోదా కృష్ణ, శ్రీ లడ్డు గోపాల్, శ్రీ మాఖన్ కృష్ణ రూపాల్లో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ వేడుకలకు విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం(C.L. Rajam), యాదగిరి గుట్ట ట్రస్టు బోర్డు సభ్యురాలు విజయరాజం(Vijayarajam) దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. లడ్డు గోపాల్, మాఖన్ కృష్ణులకు ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. కాగా వేడుకలు ఉదయం షోడశోపచార సేవతో ప్రారంభమయ్యాయి. శ్రీ రాధా గోవిందులకు పుష్పాలు, నవ వస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలతో అలంకరణ చేసి శృంగార హారతి నిర్వహించారు.
సుదర్శన నరసింహ హోమం, 56 రకాల వంటకాలతో ఛప్పన్ భోగ్, భజనలు, కీర్తనలు, రాజభోగ హారతి నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ శ్రీ సత్యగౌరచంద్ర దాస ప్రభు.. శ్రీకృష్ణుడి ఆవిర్భావ ప్రాశస్త్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చారు. నార్సింగి (కోకపేట్)లోని నూతన హరే కృష్ణ హెరిటేజ్ టవర్లోనూ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాసిల్ వుడ్స్ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్లోనూ వేడుకలు నిర్వహించారు.






