టీఎల్ఎం ప్రతిభకు గుర్తింపు.. మానసకు ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు
04-09-2026 | 05:55pm
నాగల్గిద్ద, సెప్టెంబర్ 4( విజయ క్రాంతి): నాగల్ గిద్ద మండల పరిధిలోని గంగారం తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మానస నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ, బోధనాభ్యసన సామగ్రి (టీఎల్ఎం) వినియోగం, ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన టీఎల్ఎం ప్రదర్శనలో మానస ప్రతిభను పలువురు అభినందించారు. ఆమె అవార్డుకు ఎంపిక కావడం పట్ల గంగారం తండా గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మానసను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన ఈ గుర్తింపు పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.






