అలాంటి దుస్తులు ఉంటాయా?
అందచందాలతో ఆకట్టుకోవడమే కాదు, అభినయంలోనూ అదుర్స్ అనిపిస్తూ యువ ప్రేక్షకుల హృదయాల్లో తిష్ట వేసిన హీరోయిన్లలో అందాల తార మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఒకరు. సహజంగానే చూపు తిప్పుకోనివ్వని ఒంపుసొంపులు ఈ ముద్దుగుమ్మ సొంతం. అందుకేనేమో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Kollywood star hero Karthi) తన మనసులోని మాటను బయటపెట్టాడు. కానీ, ఆ వ్యాఖ్యలు కార్తిని విమర్శల పాలు చేశాయి. ఔను, మాళవిక మోహనన్ను ఉద్దేశించి కార్తి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్గా మారాయిప్పుడు.
కార్తి ప్రస్తుతం యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్-2’లో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్గా రూపుదిద్దుకుంటోందీ చిత్రం. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఆ వేడుకలో హీరో కార్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ వేడుకలో కార్తి మాట్లాడుతూ.. సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహనన్ను ఎంపిక చేసే సమయంలో చిత్రబృందంతో జరిగిన ఒక సరదా సంభాషణను పంచుకున్నారు. ‘హాలీవుడ్ నటి మోనికా బెల్లూచి తరహాలోనే మాళవికకు కూడా ఈ సినిమాలో మంచి గ్లామరస్ దుస్తులు ఉంటాయా? అని నేను దర్శక నిర్మాతలను సరదాగా అడిగాను’ అంటూ వేదికపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కాస్తా నెటిజన్లకు తప్పుగా అర్థమయ్యాయి. ఆయన మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కార్తి ఈ విషయాలను సరదాగానే చెప్పినప్పటికీ, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాల్లో మాళవిక ఒక సీరియస్ రోల్లో, పవర్ఫుల్ స్పై ఏజెంట్గా హెవీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ కనిపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న కీలకమైన పాత్ర పోషిస్తున్న ఒక నటి గురించి మాట్లాడేటప్పుడు.. ఆమె యాక్షన్ పెర్ఫార్మెన్స్, కష్టపడిన విధానం గురించి చెప్పకుండా కేవలం గ్లామర్, దుస్తుల కోణంలో మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని విమర్శిస్తున్నారు.
ఒక సీనియర్ నటుడిగా కార్తీ హీరోయిన్ ప్రతిభ కంటే గ్లామర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోందంటూ ఆయన వ్యాఖ్యలను బట్టి అనిపిస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే తాను ఆ మాటలను థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు తెరపై మంచి వినోదాన్ని అందించాలనే ఆలోచనతోనే సరదాగా అడిగినట్లు కార్తీ క్లారిటీ ఇచ్చారు.






