6 September, 2026 | 4:45 PM

ఉచిత కంటి పరీక్షలకు విశేష స్పందన

06-09-2026 | 03:32pm

800 మందికి పరీక్షలు.. 180 మందికి శస్త్రచికిత్సల గుర్తింపు

కల్లూరు, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): శ్రీ షిరిడీ సాయి రామ ధ్యాన(Sri Shirdi Sai Rama Meditation) మందిరం, కల్లూరు–పెనుబల్లి వారి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి(Kakinada Sri Kiran Eye Hospital) నిర్వహణలో ఆదివారం కల్లూరు పీఎంఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 800 మందికి కంటి పరీక్షలు చేయగా, 180 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. శిబిరాన్ని కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ప్రారంభించారు. నేత్ర వైద్య నిపుణులు కె. హరిబాబు, అఫ్రిద్ తదితరులు పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్సలు అవసరమైన 180 మందికి ఈ నెల 20, 23, 27 తేదీల్లో కాకినాడలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో నిర్వాహకులు జన్నారెడ్డి నరసింహారెడ్డి, కార్యదర్శి కొప్పరపు బలరాం, ట్రెజరర్ బాలాజీ, పీఆర్వో మోటూరి శివప్రసాద్, సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు, రాచమల్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కే. సిరాజుద్దీన్, శ్రీనివాసరావు, రాజు, యాస శ్రీకాంత్, జిల్లెల్ల కృష్ణారెడ్డి, పీఎంఎస్ హైస్కూల్‌కు చెందిన వీర రాఘవయ్య, సత్తుపల్లి కాకతీయ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, కల్లూరు మండలానికి చెందిన పది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు.

మరిన్ని వార్తలు