ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి

09-09-2026 | 07:35pm

- పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి

- అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలి

- క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి(CEO Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తొలగించాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah)తో కలిసి తాంసీ, భీంపూర్ మండలాల్లో సీఈఓ పర్యటించారు.

తాంసీ మండలం ఘోట్కూరి, భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను తనిఖీ చేశారు. బీఎల్‌ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు.

ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహశీల్దార్లు సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ అనంతరం కలెక్టర్ల స్థాయిలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

బీఎల్‌ఓలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఈఓ సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి వివరాన్ని సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని డైట్ కళాశాల, సంజయ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సీఈఓ, కలెక్టర్ సందర్శించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. 

మరిన్ని వార్తలు