గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ కావ్య
హనుమకొండ,(విజయక్రాంతి): చారిత్రక వేయి స్తంభాల దేవాలయం(Thousand Pillar Temple)లో శ్రీ ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాల(Sri Utthishtha Ganapati Navratri celebrations)కు సంబంధించిన కరపత్రాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) ఆవిష్కరించారు. సెప్టెంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆలయంలోని శ్రీ రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఎంపీకి వేద ఆశీర్వచనం అందించారు.
ఆధ్యాత్మిక, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి. అనిల్ కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ అవధాని, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.