గంగారం రత్నదీప్లో కాలం చెల్లిన వస్తువులు!
- జూసుల్లో పురుగులు,దుర్వాసన ఐస్క్రీమ్లు
- ఫుడ్ సేఫ్టీ అధికారులపై వినియోగదారుల ఆగ్రహం
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): మియాపూర్ సర్కిల్ పరిధి గంగారంలో రత్నదీప్ సూపర్మార్కెట్లో (Ratnadeep Supermarket) కాలం చెల్లిన, నాణ్యత లేని ఆహారపదార్థాలు అమ్ముతున్నారని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జ్యూస్ బాటిళ్లలో పురుగులు కనిపించడం, కొన్ని ఐస్క్రీమ్ల నుంచి దుర్వాసన రావడంతో కుటుంబాలు, ముఖ్యంగా చిన్నారులు కొనుగోలు చేసే వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
స్టోర్ సిబ్బందిని ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రాలేదని, కొన్ని ప్యాకెట్లపై గడువు తేదీలు మార్చి అమ్ముతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయని వారు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ అధికారులను పలుమార్లు సంప్రదించినా స్పందన లేకపోవడంతో వినియోగదారులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
కాలం చెల్లిన లేదా పాడైన ఆహారం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్న స్థానికులు, రత్నదీప్ అవుట్లెట్లో తక్షణ తనిఖీలు నిర్వహించి అనుమానిత ఉత్పత్తుల నమూనాలను ప్రయోగశాలకు పంపాలని, ఆరోపణలు నిజమైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.