అనురాగ్ లో ఏఐ కార్నివల్–2026 నిర్వహణ
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (Artificial Intelligence and Machine Learning) విభాగం, ఐఈఈఈ ఎడ్యుకేషన్ సొసైటీ మెటావర్స్ గేమింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఐ కార్నివల్–2026 ను నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థుల సృజనాత్మకతకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.
మొదటి రోజు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డీఆర్డీవోకు చెందిన డీవైఎస్ఎల్–ఎస్ఎం శాస్త్రవేత్త పవన్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. ఇండస్ట్రీ అలయన్సెస్ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ్ ఘోష్, ఐఈఈఈ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రెజరర్ అండ్ సెక్రటరీ, ముఖ్య అతిథి డాక్టర్ వివేక్ కులకర్ణి, ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రీ అలయన్సెస్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ మిరియాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక రంగ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, నిరంతర అభ్యసనం, ప్రాయోగిక అనుభవాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.