ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హనుమకొండ,(విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి(Collector Chahat Bajpai) ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై ఫిర్యాదులను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రజావాణి(Prajavani) దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై దరఖాస్తుదారులకు తగిన సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాస్థాయిలో 123, డివిజన్ 23, మండల ఆఫీసర్స్ స్థాయిలో 123 (మొత్తం 269)దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, డిఆర్ఓ శ్రీనివాస్, డి ఆర్ డి ఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
