గరిడేపల్లి చెరువులో నీటి కుక్కల సందడి
18-09-2026 | 09:58pm
* ఆసక్తిగా తిలకించిన స్థానికులు.. సెల్ఫోన్లలో చిత్రీకరణ
గరిడేపల్లి, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తాళ్లచెరువులో గురువారం నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. నీటిలో వేగంగా ఈదుతూ, అప్పుడప్పుడు ఒడ్డుకు వచ్చి సంచరిస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించి సెల్ఫోన్లలో చిత్రీకరించారు. నాగార్జునసాగర్ పరిసరాల్లో ఎక్కువగా కనిపించే ఇవి గరిడేపల్లి తాళ్లచెరువుతో పాటు రావిచెరువు, పొనుగోడు చెరువుల్లోనూ కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నీటి లభ్యత, ఆహారం సమృద్ధిగా ఉండటంతోనే ఇవి ఈ ప్రాంతాలకు వచ్చినట్లు చెరువు చైర్మన్ చామకూరి దశరథ్(Chairman Chamakuri Dasarath) తెలిపారు. అరుదుగా కనిపించే వన్యప్రాణులను వీటి సంచారానికి ఆటంకం కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.