ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలి
హుజూరాబాద్ నియోజకవర్గంలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు
బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్
హుజూరాబాద్,(విజయక్రాంతి): లోయర్ మానేరు డ్యామ్ (Lower Maneru Dam)లో ప్రస్తుతం సుమారు 10 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నందున, ప్రభుత్వం వెంటనే కాకతీయ కాలువ(Kakatiya Canal) ద్వారా నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ రైతు సంఘం(BRS Farmers Association) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువల ద్వారా కనీసం రెండు తడులైనా నీటిని విడుదల చేస్తే గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, అటు రైతులకు పంటలకు, ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఎల్ఎండీలో తగినంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.